గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది.
ఆయన పర్యటనపై దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతా నగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు.
తెనాలిలో సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, తెనాలిలో దళిత, మైనారిటీ వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసులు ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఏప్రిల్ 25న తెనాలిలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంత దారుణంగా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ యువకులు దళిత, మైనారిటీ వర్గాలకు చెందినవారని తెలుస్తోంది. గంజాయి కలిగి ఉన్నారనే అనుమానంతో ఓ పోలీసు కానిస్టేబుల్తో ఈ యువకులకు వాగ్వాదం జరిగిందని,
ఆ తర్వాతే రద్దీగా ఉండే రోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు వారిని కింద కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారని సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో మే 26న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

