telugu navyamedia
రాజకీయ వార్తలు

బీఆర్ఎస్ పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే నాపై కక్షగట్టారు: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

‘‘బీఆర్ఎస్ పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో నిర్వర్తించా పార్టీలో, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకు నన్ను దారుణంగా అవమానించి బయటకుపంపించారు” అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో కంటతడి పెట్టారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు తనను ఎన్నో సందర్భాలలో అవమానించారని చెప్పారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇచ్చినా చైర్మన్ ఆమోదం తెలపకపోవడంతో మండలి వేదికగా తన ఆవేదన వెల్లడించేందుకు సభకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.

శాసనమండలిలో కవిత మాట్లాడుతూ . 2014లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని చెప్పారు.

ఆ తర్వాత నుంచి తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

పార్టీలో అవినీతిని ప్రశ్నిస్తే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐలతో పోరాడేటప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలులో పెట్టించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు.

‘‘అమరువీరుల స్తూపం మొదలు కలెక్టరేట్ల వరకు  అన్నింటా అవినీతి జరిగింది. సిద్దిపేటలో నిర్మించిన కలెక్టరేట్‌ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది.

అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛను ఇవ్వాలని పార్టీ వేదికల్లో డిమాండ్ చేసినా పట్టించుకోలేదు.

కేసీఆర్‌ను అడిగే ధైర్యం నాకే ఉందని ఎన్నో విషయాలు అడిగాను. బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నిమార్లు కోరినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ పరిశ్రమ తెరిపించలేకపోవడం నాకు అవమానకరం.

కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ లో పెద్ద నాయకులమని చెప్పుకునే వాళ్లు ఎవరూ స్పందించలేదు.

అందుకే ప్రెస్‌మీట్‌ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లు మీడియాకు వెల్లడించాను’’ అని కవిత అన్నారు.

Related posts