గుంటూరు – విజయవాడ మధ్య నడుసున్న డెమూ ప్యాసింజర్ రైలు వేళలని మార్పు చేసినట్లు రైల్వే సీనియర్ డీసీఎం డీ నరేంద్ర వర్మ తెలిపారు. నంబరు. 77205 గుంటూరు – విజయవాడ రైలు ప్రస్తుతం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరి 6 గంటలకు విజయవాడ చేరుకొంటోంది. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ రైలు సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.25 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ మార్పులను ప్రయాణీకులు గమనించాలని సీనియర్ డీసీఎం విజ్ఞప్తి చేశారు.
నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేలైన్ మొదటి దశ పనులు 2020 మార్చినాటికి పూర్తి కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పరిపాలనాధికారి అమిత్ గోయల్ తెలిపారు. ఆయన ప్రాజెక్ట్ ఛీఫ్ ఇంజనీర్ పి.సూర్యబ్రహ్మానందంతో కలిసి రైల్వే పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజుపాలెం, రొంపిచర్ల మండలం గోగులపాడు వద్ద భూమిని రెవెన్యూ అధికారులు రైల్వేశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టుకు దాదాపు రూ.290కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం పిడుగురాళ్ల-కనిగిరి వరకు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా చెల్లించాల్సి ఉందని తెలిపారు. వీటిని రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేస్తేనే తదుపరి ప్రాజెక్టు ముందుకువెళుతుందని అధికారులు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన న్యూ పిడుగురాళ్ల, నకరికల్లు, కుంకలగుంట, రొంపిచర్ల, వేల్పూరు రైల్వేస్టేషన్లను పరిశీలించి సూచనలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని దర్శి, పొదిలి, కనిగిరి, నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, రాపూరులు కొత్తగా రైల్వే పటంలోకి రానున్నట్లు తెలుస్తుంది. అనంతరం ట్రాక్పై ట్రాలీతో ట్రయల్ రన్ వేశారు. ఆయనతోపాటు డిప్యూటీ ఛీఫ్ ఇంజనీర్ కె.ముత్యాలనాయుడు, రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.