నాని నిర్మాతగా మారి తొలిసారిగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం “అ!”. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించి అలరించారు. ఈ చిత్రం ఇటీవల రెండు జాతీయ అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అందాల భామ కాజల్ ప్రధాన పాత్రలలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పలు కథలతో మొదటి పార్ట్ తెరకెక్కగా, రెండో పార్ట్ మొత్తం ఒక్కటే కథతో రూపొందనుందట. ఆ కథ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అందించేదిగా ఉంటుందని అంటున్నారు. సీక్వెల్ విషయం గురించి ప్రశాంత్ ఇటీవల ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడారు. “అ!” చిత్రానికి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. మరి ఇందులో విజయ్ సేతుపతి, కాజల్ జంటగా నటిస్తారా ? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
next post

