బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్కు ఓ అభిమాని చేసిన విన్నపం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్కు చెందిన నానక్రామ్ టీస్టాల్ నడుపుకుంటూ ఉంటాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన నానక్రామ్ అజయ్ దేవగణ్కు వీరాభిమాని. ఇప్పుడు ఈ అభిమాని తన అభిమాన హీరో పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య ప్రకటనల్లో నటించొద్దు అంటూ విన్నవించుకున్నాడు. ఎందుకంటే అజయ్ దేవగణ్ ఏ పొగాకు ఉత్పత్తినైతే బ్రాండింగ్ చేశాడో దాన్నే సదరు అభిమాని వాడేవాడని, అదే ఇప్పుడు నానక్ రామ్ క్యాన్సర్కు కారణమైందని అంటున్నారు కుటుంబ సభ్యులు.
“అజయ్ దేవగణ్ నటించిన బ్రాండ్ పొగాకునే మా నాన్న కొన్నేళ్లుగా వాడుతున్నారు. దాని కారణంగా ఇప్పుడు ఆయనకు క్యాన్సర్ సోకింది. అంత పెద్ద నటుడు ఇలాంటి పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయకూడదని మా నాన్న భావించారు. అందుకే మా వంతు ప్రయత్నంగా పొగాకు ఉత్పత్తులకు బ్రాండిగ్ చేయవద్దని అజయ్ దేవగణ్కు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం” అని నానక్ రామ్ తనయుడు దినేష్ మీనా తెలిపారు. అంతేకాదు అజయ్దేవగణ్కు తన బాధను, జరిగిన నష్టాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగా నానక్ రామ్ కుటుంబ సభ్యులు 1000 కరపత్రాలను ముద్రించి సంగనెర్, జగత్పురా ప్రాంతాల్లోని గోడలకు అంటించారు. మద్యం, సిగరెట్, పొగాకు శరీరానికి చాలా హానికరమని వాటిని నటులెవ్వరూ ప్రమోట్ చేయవద్దని కరపత్రంలో నానక్రామ్ కోరారు. మరి ఈ విషయం గురించి అజయ్ దేవగన్ ఏమంటారో చూడాలి.
జగన్ ప్రవర్తనతో ఆశ్చర్యపోయా.. : జేడి చక్రవర్తి