కరోనా వైరస్ తో కుదేలైన దేశ ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకుంటుందనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని అన్నారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ ఎఫ్ఎంసీజీ సప్లై చైన్ ఎక్స్పోలో ఆయన మాట్లాడారు. గత నెలలో ఎగుమతులు మంచి వృద్ధిని కనబరిచాయని గోయల్ చెప్పారు.
2019 జూలైలో నమోదైన ఎగుమతుల్లో 91శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. దిగుమతులు డెబ్బై శాతం నమోదయ్యాయన్నారు. విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత పారిశ్రామికరంగంలో నమ్మకం ఏర్పడిందన్నారు. ఇది మరింత వృద్ధికి సహకరిస్తుందన్నారు.పెట్రోలియం, టెక్స్టైల్ రంగాలలో మందగమనం కారణంగా జూన్ వరకు వరుసగా నాలుగు నెలలు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయన్నారు.