తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బిఈడీ ఇతర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ 2019-20 విద్యా సంవత్సరం నుండి 2021-22 విద్యా సంవత్సరం వరకు ఫీజులు ఖరారు చేసేందుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీల గడిచిన రెండేళ్ల ఆదాయ వ్యయాల ఆధారంగా ఫీజుల ఖరారు ఉంటుందని పేర్కొంది.
యాజమాన్యాలు కోర్సుల వారీగా తమ ఆదాయ వ్యయాల వివరాలు, ఫీజుల ప్రతిపాదనలను ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించింది. వాటిని ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు వచ్చే నెల 21 వరకు గడువును ఇస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలను ఈ నెల 25న తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వివరించింది.
మధ్యతరగతి కాలేజీల ఫీజుల్లో పెద్దగా వ్యత్యాసం రాకున్నా మంచి కాలేజీల ఫీజులు మరింత పెరిగే అవకాశముంది. 20 ఏళ్లకు పైబడి సకల సదుపాయాలు, టాప్ర్యాంకర్లు చేరుతున్న విద్యాసంస్థలను గుర్తించారు. వీటిలో ఫీజులు భారీగా పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఇంజనీరింగ్లో గరిష్టంగా కన్వీనర్ కోటా ఫీజు 2 లక్షలు ఉంది. అదే ఎంబీఎకు 43వేలు, ఎంసీఏకు 80వేలు ఫీజు వసూలుచేస్తున్నారు. 2016–17, 2017–18 విద్యా సంవత్సరాల లెక్కల మేరకే ఫీజులు నిర్ణయించేందుకు చర్యలు చేపట్టింది.