ముంబయిలోని తలోజా జైలులో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు జైల్ నుంచి వీవీ భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. దీనిపై వరవరరావు అల్లుడు వేణుగోపాల్ స్పందించారు. తమకు జైలు అధికారులు సమాచారం అందించారనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జైల్లో ములాఖాత్ లు లేనందున వారానికోసారి ఫోన్ చేసే వీలు కల్పించారని, దాంతో ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులకు వరవరరావు ఫోన్ చేసి మాట్లాడారని అన్నారు. ఆయన మాట్లాడిన తీరును బట్టి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు. అంతేతప్ప, జైలు అధికారుల నుంచి వరవరరావు ఆర్యోగంపై ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని, దానిపై రేపు విచారణ జరుగుతుందని వరవరరావు అల్లుడు వెల్లడించారు.