సిద్దిపేట జిల్లాలోని రంగనాయక ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువలకు శనివారం తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్రావు పూజలు చేసి నీటిని వదిలారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల వెంట బిరబిరా గోదావరమ్మ పరుగులుపెడుతుంటే రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలుచెబుతునానని అన్నారు.
ఇంత కాలం కరెంట్, కాలువ మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. ఇక నుంచి కరెంట్ , కాలువతో నిమిత్తం లేకుండా రెండుపంటలు పండించే రోజులు వచ్చాయని అన్నారు. యేడాదంతా రంగనాయక సాగర్లోకి నీరు వస్తుంది కాబట్టి యేడాదికి రెండుపంటలు హాయిగా పండించవచ్చన్నారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు.