హైదరాబాద్ నగరంలో కరోనా (కోవిడ్-19) కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ సోకకుండా వుండడానికి మాస్కులు ధరించాలన్న ఉద్దేశంతో చాలా మంది మాస్కులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మాస్కులకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావిస్తున్న మందుల వ్యాపారస్తులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.
హోల్సేల్లో రూ.1.60 విలువ చేసే రెండు లేయర్ల మాస్కును ఇప్పుడు రూ.20-25 వరకు డిమాండ్ను బట్టి అమ్ముతున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్95 మాస్క్ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. మాస్కులకు ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద వీటికి మరింత డిమాండ్ పెరిగింది.