ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్ సర్వేలో వైఎస్ జగన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రుల పని తీరు మీద ఈ సంస్థ పోల్ సర్వే నిర్వహించింది. అందులో ఏపి నుండి స్పందన వ్యక్తం అయింది. అందులో భాగంగా వచ్చిన ఓట్ల ఆధారంగా సంస్థ ఫలితాలను ప్రకటించింది. అందులో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ (బీజేపీ), రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఏఏపీ), పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), మూడో స్థానంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ నిలిచారు. ఆ తరువాత ఏపీ సీఎం జగన్ కు స్థానం దక్కింది.
గత ఏడాది మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన పలు పధకాలను తొలి ఆరు నెలల్లోనే అమలు ప్రారంభించారు. ఒక వైపు వివాదాలు..మరో వైపు పధకాల అమలు కొనసాగించారు. ఇక,జగన్ తర్వాత బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎంల జాబితాలో అయిదో స్థానంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆరో స్థానంలో గుజరాత్ సీఎం విజయ్రూపాని, ఏడో స్థానంలో రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్లు నిలిచారు. ఈ బెస్ట్ పెర్ఫార్మింగ్ సీఎం సర్వేలో 2016 నుంచి ఉన్న ట్రెండ్స్ కూడా పొందుపరిచారు. యోగి ఆదిత్యనాథ్ దాస్కు సంబంధించి 2017 ఆగస్టు నుంచి, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీష్కుమార్, నవీన్ పట్నాయక్లకు సంబంధించి 2016 ఫిబ్రవరి నుంచి వారి పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఈ రేటింగ్ ఇచ్చినట్లుగా స్పష్టం చేశారు.