ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఏసీబీ) కర్నూలు జిల్లా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కర్నూలు సహా హైదరాబాద్, బెంగళూరు, తాడిపత్రిలో ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ సంపాదన కూడబెట్టినట్లు లెక్కతేల్చారు.
బెంగళూరులో జి 7 అపార్ట్మెంట్తోపాటు హైదరాబాద్లో మరో భవనం కూడా ఉన్నట్లు లెక్క తేల్చారు. కర్నూల్లోని ఇంట్లో కేజీకిపైగా బంగారాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా యుగాండా దేశంలో బ్యాంక్ అకౌంట్, హైదరాబాద్లోని ఓ బ్యాంక్లో లాకర్ ఉన్నట్లు గుర్తించారు.అలాగే, భార్య పేరు మీదు శివప్రసాద్ రెండు సూట్ కేసు కంపెనీలను నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది. భారీగా అక్రమాస్తులు బయటపడడంతో సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశముంది.