గత ఆదివారం ఓ అపార్ట్మెంట్లో హత్య జరిగిందనే సమాచారం రావడంతో పోలీసులు సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. లిల్లియన్ పార్క్స్(87) అనే వృద్ధురాలు అంగవైకల్యంతో ఉన్న మనవడు జోయెల్ పార్క్స్ (30)కు ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. లిల్లియన్ పార్క్స్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. ‘నేను చనిపోతే నా మనవడిని ఎవరు చూసుకుంటారు? అందుకే ఓవర్ డోస్ ఇచ్చి నా మనవడిని నేనే హత్య చేశా’ అంటూ కేకలు పెట్టింది. దీంతో అధికారులు ఆమెను మెడికల్ కస్టడీకి అప్పగించారు. టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తరువాత జోయెల్కు ఎటువంటి డోస్ ఇచ్చిందనేది తెలుస్తుందని పోలీసులు తెలిపారు. జోయెల్ పార్స్క్ తండ్రి ఎప్పుడో మరణించినట్టు, తల్లి అతడికి దూరంగా ఉంటున్నట్టు అధికారులు తెలుసుకున్నారు. కాగా, జోయెల్ వారంలో ఐదు రోజులు తన సోదరి ఇంట్లో ఉంటాడని, శని, ఆదివారాల్లో లిల్లియన్ పార్క్స్ వద్ద ఉంటాడని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. మెడికల్ కస్టడీ నుంచి వచ్చిన అనంతరం లిల్లియన్పై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.