కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా నది వరదల పై చంద్రబాబు ఘాటుగా స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై కక్షతో లక్షల మంది ప్రజలను వరదల్లో ముంచేశారని ఏపీ సర్కార్ పై మండిపడ్డారు. ఇళ్లు, వేల ఎకరాల పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వరద నిర్వహణను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
వరద తీవ్రత అంచనా, ముందు జాగ్రత్త అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తనను, తన నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడమే వైసీపీ ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కక్షకబట్టి రాష్ట్రానికి నష్టం, పేదలకు కష్టం కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా నదికి వరదలొస్తే సీఎం అమెరికా వెళ్లారని, మొన్న గోదావరికి వరదలొస్తే జెరూసలెం వెళ్లారని దుయ్యబట్టారు. నిత్యావసరాలు అందక వరద బాధితులు అల్లాడిపోతున్నారని అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.