ఐసీసీ ప్రపంచకప్ లో టీమిండియా ప్రస్థానం సెమీస్ తో ముగిసిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో కోహ్లీసేన పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పోరాడిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజాను ఓదార్చలేక అతడి భార్య రివాబా ఎంతో ఆవేదనకు గురైందట.
రివాబానే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది. తాను అవుట్ కాకుండా క్రీజులో ఉంటే టీమిండియానే గెలిచేదని జడేజా తనతో అన్నాడని వివరించింది. న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత జడేజా కుమిలిపోయాడని, “నేను అవుట్ కాకుండా ఉంటే” అనే మాట ఎన్నోసార్లు చెప్పాడని రివాబా పేర్కొంది. అతడ్ని ఓదార్చడం తమ వల్ల కాలేదని తెలిపింది. జడేజా క్రీజులో ఉన్నంతవరకు భారత్ విజయంపై ఆశలు కలిగినా, అతడు అవుటైన తర్వాత మ్యాచ్ కివీస్ కు అనుకూలంగా మారింది. ఈ పోరులో జడ్డూ 59 బంతుల్లో 77 పరుగులు చేశాడు.