భారత్పై ఉగ్ర యుద్ధం చేస్తున్న పాక్ ఉగ్రవాది, జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి మోకాలడ్డుతున్న చైనాకు చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకుంటున్నాయి ఇతర దేశాలు. ఆ దిశగా మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సిద్ధమవుతోంది.
మసూద్ పై చర్యకు భద్రతా మండలిలో అన్ని దేశాలు అంగీకరిస్తున్నా వీటో అధికారం ఉన్న చైనా పదేపదే మోకాలడ్డుతుండడంతో అతన్ని తమకు తాముగా ఉగ్రవాది జాబితాలో చేర్చాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. గత వారం ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానాన్ని ప్రస్తావించిన ఫ్రాన్స్ ఇప్పటికే తమ దేశంలో జైషే చీఫ్ను నిషేధించింది. తమ దేశంలోని అతని ఆస్తులను స్తంభింపజేసింది.
ఎమాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ఇదే దిశగా మిగిలిన దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించింది. యూనియన్లోని 28 సభ్య దేశాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 2009, 2016తో పాటు ఇటీవల యూఎన్ భద్రతా మండలిలో మసూద్ అజర్ పై తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది అమల్లోకి వస్తే చైనా తీరుకు చెంపపెట్టే అవుతుంది.