విలక్షణ నటన, హాస్యంతో సినిమా తెరపై నాలుగు దశాబ్దాలకుపైగా అలరించిన రాళ్లపల్లి మే 17న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్ మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య స్వరాజ్యలక్ష్మి, కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉంటున్న రాళ్లపల్లి రెండో కూతురు, అల్లుడు వచ్చేవరకు ఆయన అంత్యక్రియలను నిలిపివేసిన విషయం తెలిసిందే. సోమవారం కూతురు, అల్లుడు సమక్షంలో రాళ్లపల్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఫిల్మ్నగర్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
ఇక ఆయన పెద్ద కూతురు చాలాకాలం క్రితమే మరణించారు. పెద్ద కూతురు మరణం ఆయనని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. తన పెద్దకూతుర్ని డాక్టర్ని చేయాలని రాళ్లపల్లి కలలు కన్నారు. అందుకోసం ఆమెను రష్యాకు పంపించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి విమానంలో రష్యాకు వెళ్లేందుకు సిద్ధం చేశారు. అయితే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా తన కూతురుని ఫ్లైట్లో పంపించాలని రాళ్లపల్లి అనుకుంటే… ఫ్రెండ్స్తో కలిసి వెళతానని కూతురు కోరడంతో అందుకు రాళ్లపల్లి అంగీకరించారు. అలా రైలులో ఢిల్లీకి బయలుదేరిన రాళ్లపల్లి కూతురు మార్గ మధ్యలో బ్రెయిన్ ఫీవర్కు గురైంది. అత్యవసర చికిత్స అందాల్సిన పరిస్థితి. కానీ ఆమె రైలులో ఉండటంతో అది వీలు పడలేదు. దీంతో ఢిల్లీకి వెళ్లే లోపే ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఆమె మరణం తర్వాత రాళ్లపల్లి చాలా కాలం పాటు డిప్రెషన్లోనే ఉన్నారు.