తనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయని నిజామాబాద్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మీడియాతో ఆమె మాట్లాడుతూ ఎవరెన్ని కుట్రలు చేసినా గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు.
పసుపు బోర్డు ఇచ్చే అధికారం బీజేపీకి ఉన్నప్పటికీ రైతుల గోడును పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి పసుపు బోర్డును ఇస్తామని వారు చెబుతున్నారని దుయ్యబట్టారు. అలాంటివారి మాటలను ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించారు. బీజేపీ చెబుతున్న తప్పుడు హామీలను యువత నమ్మరాదని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేయాలని కోరారు.