హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచార సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. స్టేడియంలో జనం లేకపోవడంతోనే ఆయన ప్రచార సభను రద్దు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకోవడం ఇదే తొలిసారి.షెడ్యూల్ ప్రకారం ఎల్బీ స్టేడియంలో సభా సమయాన్ని సాయంత్రం 5:30 గంటలుగా పేర్కొన్నారు. మిర్యాలగూడ సభలో సీఎం కేసీఆర్ సాయంత్రం 4గంటలకు పాల్గొనాల్సి ఉంది.
ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మిర్యాలగూడకు సాయంత్రం 5:45 గంటలకు చేరుకున్నారు. సభలో 6:18 గంటలకు తన ప్రసంగాన్ని ముగించుకొని తిరిగి హైదరాబాద్కు హెలికాప్టర్లో బయలుదేరారు. రాత్రి 7:12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఎల్బీ స్టేడియం సభకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం భద్రతా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
కానీ సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్పోర్టులో హెలికాప్టర్ దిగిన వెంటనే ఎల్బీ స్టేడియం సభకు ఎంత మంది జనం వచ్చారని వాకబు చేసినట్లు తెలిసింది. స్టేడియం పూర్తిగా నిండలేదని, ఐదారువేల మంది కంటే ఎక్కువ జనం లేరని, సీట్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయని ఆయనకు పార్టీ ముఖ్యులు నివేదించినట్లు తెలిసింది. దీంతో ఆయన నేరుగా ప్రగతిభవన్కు వెళ్లారు. ఆ తర్వాత కూడా ఎల్బీ స్టేడియం జనంతో నిండకపోవడంతో సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ నగర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాను సభకు రానని వారికి కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. సభకు సీఎం కేసీఆర్ రావడం లేదని ఎల్బీ స్టేడియం వేదికపై నుంచి మంత్రి తలసాని ప్రకటించారు.