తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. భూవివాదం కేసులో ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు ఆదేశాలపై ఎన్ పెద్దిరాజు సుప్రీంకోర్టులో సవాలు వేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు.
ఆ పిటిషన్లో హైకోర్టు తీర్పునకు సంబంధింన అంశాలతో పాటూ జడ్జి పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఎన్ పెద్దిరాజు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. అలాగే ఎన్ పెద్దిరాజుతో పాటు, ఆయన అడ్వకేట్ రితేష్ పాటిల్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ బీఆర్ గవాయి .. తదుపరి విచారణకు పిటిషనర్ అండ్ పెద్దిరాజు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
అయితే ఈ అంశంపై పిటిషనర్ తరపు న్యాయవాది రితీష్ పాటిల్.. కోర్టు సాక్షిగా క్షమాపణ కోరారు. కేసు విత్డ్రా చేసుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.
కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ సీజేఐ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీస్పై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే.. కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 11 కు వాయిదా వేశారు.