వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగానికి గతంలో కన్వీనర్గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఢిల్లీలో ఈ కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా, సజ్జల భార్గవరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
అయితే, ఆయన అరెస్టు కాకుండా రెండు వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది.
ఈ రెండు వారాల వ్యవధిలోగా సంబంధిత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సజ్జల భార్గవరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల విషయంలో తీవ్ర అభ్యంతరాలను నమోదు చేసింది.
“మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా?
ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? ఆ పోస్టులు సహించరాని విధంగా ఉన్నాయి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

