విశాఖలో మరోసారి భారీగా గంజాయి అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇంతభారీగా తరలించడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంత గంజాయిని ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడకు తరలిస్తున్నారు.. అన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. నేడు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 865 కిలోల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.
గాజువాకలోని నత్తయ్యపాలెంలో ట్రక్కులో అరటి గెలల్లో దాచి తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్టణం రీజనల్ యూనిట్ డీఆర్ఐ అధికారులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. గంజాయితో పాటు ట్రక్కును స్వాధీనం చేసుకున్న అధికారులు.. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.