telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో భానుడి ప్రతాపం… మరో 4 రోజులు తీవ్ర ఇబ్బంది తప్పదు

summer

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల 28 వరకు ఏపీలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ చెబుతోంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాలో వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని.. ప్రజలు ఇళ్లల్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు రావొద్దని.. 46 నుండి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతాయని చెబుతున్నారు. మే 25న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°C-39°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు. వాతావరణంలో తేమ శాతం పెరగడంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఇబ్బందులు తప్పవంటోంది వాతావరణశాఖ. తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఉంటాయని.. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారంటోంది. డీహ్హైడ్రేషన్‌కు గురై శరీరంలో నీటి శాతం తగ్గుతుంది అంటున్నారు.

Related posts