రాజకీయ నేతలు పార్టీలు మారాలంటే స్వప్రయోజనం తప్పనిసరి. సాధారణంగా జరిగేది ఇదే అయినప్పటికీ, పార్టీలు మారేందుకు వేరే లెక్కలు కూడా లేకపోలేదు. దానికి ఇదిగో ఒక ఉదాహరణగా, గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్రాణే ప్రాణభయంతోనే కాంగ్రెస్ పార్టీని వీడి కమలనాథుల పంచన చేరారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా కుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని 2017లో పార్టీ వీడే ముందు స్వయంగా విశ్వజిత్ తనకు తెలియజేశాడని, కావాలంటే ఈ విషయంలో నిజనిర్థారణ పరీక్షలు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
రాజకీయ దుమారానికి కారణమైన రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో ఆడియో టేపుల వ్యవహారం ద్వారా విశ్వజిత్ వార్తలలో వ్యక్తి అయ్యారు. తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, అందుకే తాను బీజేపీతో కలిసి వెళ్తున్నానని విశ్వజిత్ వాపోయారని కుమార్ తెలిపారు. అతను చెప్పిన ప్రమాదం బీజేపీ చీఫ్ అమిత్షా, ప్రధాని మోదీ నుంచేనని కుమార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను విశ్వజిత్ కొట్టిపారేశారు. ఇటువంటి చౌకబారు విమర్శలు చేయడం కాంగ్రెస్ నైజమన్నారు. నిరాశ, నిస్పృహలతోనే చల్లా కుమార్ ఇటువంటి ఆరోపణలు చేసి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. అసలు ఆ ఆడియో టేప్ నిజం కాదని, అది సృష్టించిందని, దాని కోసం భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన అన్నారు.
పవన్ కు విజన్ లేదు ప్యాకేజ్ ఇస్తే చాలు: మంత్రి వెల్లంపల్లి