ప్రమాణ స్వీకారం రోజునే వైఎస్ జగన్ గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. వైసీపీ మేనిఫెస్టోలో కూడా ఈ గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల గురించి పొందుపరిచారు. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఆదివారం నిర్వహించిన ఆర్థిక, రెవెన్యూ శాఖల సమీక్షలో కూడా గ్రామ సచివాలయాల గురించి ప్రధానంగా చర్చించారు. గ్రామ వాలంటీర్లకు చెల్లించాల్సిన జీతభత్యాలు ఎంతవుతాయో ఏంటో ఆరా తీశారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు, గ్రామ వాలంటీర్లకు చెల్లించే జీతభత్యాల ఖర్చు సంవత్సరానికి రూ.3,708 కోట్లుగా అధికారులు లెక్కగట్టారు.
గ్రామ వాలంటీర్లకు జీతాల రూపంలో సంవత్సరానికి రూ.1500 కోట్లు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.2,208 కోట్ల జీతభత్యం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. అయితే.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ బడ్జెట్ దృష్ట్యా ఇది అదనపు భారంగా పడనుందని సమాచారం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ అందించే ఉద్దేశంతో, పథకాల అమలులో అవినీతి లేకుండా పారదర్శకత ఉండాలని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, గ్రామ వాలంటీర్ల ద్వారా పథకాలను అందించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే చెప్పారు. ఆగస్ట్ 15 నుంచి నాలుగు లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించనున్నట్లు జగన్ స్పష్టం చేశారు. గ్రామంలోని 50 ఇండ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తామని, రూ.5000 నెల వారీ జీతాన్ని చెల్లిస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.