వాట్సాప్లో వైరలైన పసికందుల విక్రయం ఆడియో ప్రస్తుతం నామక్కల్ జిల్లాలో కలకలం రేపుతోంది. 30 ఏళ్లుగా పసికందులను విక్రయిస్తున్నానంటూ ఓ విశ్రాంత నర్సు మాట్లాడినట్టు ఆ ఆడియో సంభాషణలు ఉండటమే అందుకు కారణం. దీని వెనుక పిల్లలను విక్రయించే పెద్ద రాకెట్ ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సేలం జిల్లా ఓమలూర్కు చెందిన పిల్లలు లేని దంపతులతో విశ్రాంత నర్సు ఒకరు మాట్లాడిన సంభాషణలు ఉండే ఆడియో ఒకటి ఇటీవల వాట్సాప్లో వైరల్గా మారింది. అందులో.. 30 ఏళ్లుగా పిల్లలను విక్రయిస్తున్నట్టు, ఆ పనిపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టడంతో తాను స్వచ్ఛంద విరమణ చేసినట్టు సదరు విశ్రాంత నర్సు తెలిపింది. అడ్వాన్స్గా రూ.30వేలు ఇవ్వాలని, అప్పుడే పసికందు కోసం తాను రిజర్వేషన్ చేయవచ్చని పేర్కొంది. పసికందు తన వద్దకు చేరిన తర్వాత చూసుకోవడానికి రావచ్చని, జనన ధ్రువీకరణ పత్రం కావాలంటే అదనంగా రూ.70 వేలు ఇవ్వాలని తెలిపింది.
ఈ సంభాషణలు ద్వారా సదరు విశ్రాంత నర్సు నామక్కల్ జిల్లా రాశిపురానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. పసికందు రంగు, రూపం ఆధారంగా మగ శిశువుకు రూ.4 లక్షలు, ఆడ శిశువుకు రూ.3లక్షల వరకు ధర నిర్ణయించినట్టు తెలుస్తోంది. అనాథ ఆశ్రమాల్లో ఉండే పిల్లలను సైతం విక్రయిస్తున్నారా? అనే అనుమానాలు నెలకొన్నాయి. నామక్కల్ జిల్లాలకు చెందిన సదరు విశ్రాంత నర్సు సేలం జిల్లాలోని సంతానంలేని దంపతులతో మాట్లాడటం ద్వారా ఈ నెట్వర్క్ పెద్దదిగా ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆడియో సంభాషణలు నిజమైతే 30 ఏళ్లలో వందలమంది పిల్లలను విక్రయించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఆడియో ఆధారంగా రాశిపురం మహిళా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అముద అనే విశ్రాంత నర్సు, ఆమె భర్త రవిచంద్రన్ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అరుళరసు సుమారు 11 గంటలపాటు విచారణ జరిపిన అనంతరం వారిని అరెస్టు చేశారు.
మీకేం పోయేకాలం… బాహుబలి తరువాతే కదరా మీరిద్దరూ… హీరోలపై తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు