telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఉప్పెన’ హీరోయిన్ కి మరో క్రేజీ ఆఫర్

ktithi

మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను మామూలుగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకులు అనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్‌లతో పాటు రెండు లిరికల్ పాటలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్‌కు చాలామంది అభిమానులు అయ్యారు. లిరికల్ పాటలలో కృతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లకు చాలామంది ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ రషెస్ చూసిన సుకుమార్‌కు కూడా కృతి బాగా నచ్చిందట. దీంతో లెక్కల మాస్టర్ ఆమెకు మరో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరో నిఖిల్‌తో ‘కుమారి 21f’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ’18 పేజెస్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా కృతిని సుకుమార్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇంతవరకు తన బ్యానర్‌లో గానీ, సినిమాలో గానీ హీరోయిన్లను ఎప్పుడూ రిపీట్ చేయలేదు సుకుమార్. కానీ మొదటిసారిగా కృతికి ఆ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

Related posts