రాష్ట్రంలో పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (TPDA) స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, IOCL, మరియు BPCL వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. ఇంధన సరఫరా గొలుసు ఎప్పటిలాగే సాఫీగా సాగుతోందని, ఎక్కడా నిలిచిపోలేదని అసోసియేషన్ తెలిపింది.
పెట్రోల్ కొరత రాబోతోందన్న తప్పుడు వార్తల వల్ల ప్రజలు ఆందోళనతో ఒక్కసారిగా బంకులకు వస్తున్నారని, దీనివల్ల విక్రయాలు సాధారణం కంటే 2.5 నుండి 3 రెట్లు పెరిగాయని వివరించింది.
విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో స్టాక్ త్వరగా అయిపోవడం వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కానీ అది ఇంధన కొరత కాదని పేర్కొంది.
అవసరానికి మించి ఫుల్ ట్యాంక్ చేయించుకోవద్దని ప్రజలను కోరింది. క్యాన్లు, డ్రమ్ములు లేదా డబ్బాల్లో పెట్రోల్ నిల్వ చేయడం ‘పెసో’ (PESO) నిబంధనలకు విరుద్ధమని, దీనివల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించింది.
ప్రజలు పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, కేవలం దైనందిన అవసరాలకు సరిపడా ఇంధనాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.


