ఈ సారి కూడా ఎండలు ప్రారంభంలోనే తీవ్రంగా ఉన్నాయి. ఇంకా మార్చి నెల ముగియకముందే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలో వెళ్లాలంటేనే అందరూ జంకుతున్నారు. మండుతున్న ఎండల వల్ల కాలు అడుగు బయట పెట్టాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే.. ఈ వేసవిలో ఎండల బారి నుంచి కొంత వరకు తప్పించుకున్నవాళ్ళం అవుతాము. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అయితే మరి.. ఆ సూచనలు ఏమిటో తెలుసుకుందాం..!
* ఎండాకాలంలో మన శరీరం ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్కు గురవుతుంది. శరీరంలో ఉన్న నీరంతా ఇంకిపోతుంది. దీనితో శరీరానికి సాధారణ సమయాల్లో కన్నా వేసవిలోనే ఎక్కువగా ద్రవాలు అవసరం అవుతాయి. కనుక ఆ ద్రవాలు తగ్గకుండా ఉండేందుకు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు..ఎప్పటికప్పుడు ద్రవాలను తీసుకుంటుండాలి. పండ్ల రసాలు, నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లను తాగుతుంటే శరీరంలో నీటి అవసరం సమతుల్యంలో ఉంటుంది.
* వేసవి కాలంలో వీలైనంత వరకు చన్నీటి స్నానమే చేయాలి. దీని వల్ల శరీరం చల్లగా ఉంటుంది. పొడిగా మారకుండా ఉంటుంది.
* వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రమే బయటకు వెళ్లడం ఉత్తమం. తప్పనిసరి అనుకుంటే ఆటోలు లేదా బస్సుల్లో వెళ్లవచ్చు. ఎండ తగలకుండా చూసుకోవాలి. టూ వీలర్ మీద ప్రయాణించరాదు.
* ఎండలో బయటకు వెళితే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అలాగే తలకు క్యాప్ లేదా స్కార్ఫ్ లాంటివి ధరించాలి. కళ్లకు చలువ అద్దాలు వాడాలి.
* ఎండాకాలంలో దుస్తుల విషయంలో కూడా తగిన జాగర్తలు పాటించడం చాలా అవసరం. వీలైనంత వరకు కాటన్ దుస్తులనే, అది కూడా వదులుగా, లైట్ కలర్లో ఉండే దుస్తులనే ధరించాలి.