చిత్తూరు పర్యటనలో భాగంగా కూటమి నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తన పేషీలో పనిచేస్తున్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉన్నవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అదృష్టవశాత్తు తనకు అలాంటి మంచి అధికారులు లభించారని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నా పేషీలోని అధికారులు సమాజ హితం కోరేవారు.
సుమారు పదివేల మందికి ప్రమోషన్లు ఆగిపోయిన విషయాన్ని, ప్రతి డివిజన్లో మినీ కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయనే ఆలోచనలను వారు నాతో పంచుకున్నారు.
ఇలాంటి మంచి ఆలోచనలు కలిగిన బృందం నాతో ఉండటం సంతోషంగా ఉంది” అని తెలిపారు.
రాజకీయాల్లో గుర్తింపు అనేది కష్టాన్ని బట్టి వస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. “క్షేత్రస్థాయిలో నిలబడి పనిచేయకుండా ప్రజలు ఎవరినీ నాయకుడిగా ఆమోదించరు.
నేను గుర్తింపు కోసమో, పదవుల కోసమో పాకులాడలేదు. కేవలం ప్రజల కోసం పనిచేశాను. చినుకులను ఇవ్వడం వర్షం గుణం, అలాగే నిస్సహాయులకు అండగా నిలబడటం నాయకుడి లక్షణం.
నేను నమ్మే సిద్ధాంతం అదే” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో పదవి వస్తే దాన్ని అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

