పోలవరంలో మరో చారిత్రాత్మక ఘట్టం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయింది. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ, స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణంలో కీలకమైన మొత్తం 192 గడ్డర్ల అమరిక పూర్తి చేసింది మేఘా సంస్థ. స్పిల్ వేపై గడ్డర్లు ఏర్పాటు పూర్తి కావడంతో షట్టరింగ్ పనులు చేసి స్లాబ్ నిర్మాణం పై దృష్టి పెట్టారు నిపుణులు. 23 మీటర్లు పొడవు, 2మీటర్లు ఎత్తున వున్న 192 గడ్డర్లను అతి తక్కువకాలం లో ఏర్పాటు చేసారు ఇరిగేషన్ అధికారులు. ఒక్కో గడ్డర్ తయారీకి 10టన్నుల స్టీల్, 25క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు కాగా.. మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ల సాయంతో అమర్చారు. జూలై-6-2020న గడ్డర్లను స్పిల్ వే పిల్లర్లపై పెట్టడం ప్రారంభమైంది. వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణ పనులు పూర్తి చేసింది.

