వరంగల్ జిల్లాలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి అశ్విణీవైష్ణవ్ పాటు కలిసి పరిశీలించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని, మంజూరు చేశారని ఆయన తెలిపారు.
ఆ తర్వాత ప్రధాని మోదీనే స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని.. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మోదీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారనడానికి ఇదే నిదర్శనమని కిషన్ రెడ్డి తెలిపారు.
టెక్స్టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ అవసరం ఎంతో ఉందని నేను గత బీఆర్ఎస్ పాలన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించాను.
ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విన్నవించాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుంది.
ఇదిలా ఉండగా ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బిజెపి ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అలాంటి వారు తమ కళ్లు తెరిచి చూడాలి, చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని నేను కోరుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా కాజీపేటకు వచ్చి రైల్వే మాన్యుఫాక్చరింగ్ పనులను పర్యవేక్షించడం.. ఆయన రైల్వేల అభివృద్ధిపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనమని కిషన్ రెడ్డి తెలిపారు.
వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేల విస్తరణ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో అశ్వినీ వైష్ణవ్ తెలంగాణ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.