విజయవాడలోని కొవిడ్ కేంద్రంలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. స్థానిక స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను రమేశ్ హాస్పిటల్స్, తన కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తోంది. భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఊపిరాడని బాధితులు కిటికీల వద్దకు వచ్చి కేకలు వేస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొందరు బాధితులు ఇప్పటికే సొమ్మసిల్లి పడిపోగా, వారిని లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నారు. ఈ భవనంలో ప్రస్తుతం దాదాపు 40 మందికి పైగా కరోనా బాధితులు, 10 మంది వరకూ వైద్య బృందం ఉన్నట్టు తెలుస్తోంది.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.