పాయకరావుపేట నియోజకవర్గంలో ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నైతిక విలువలు) బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రెండు చోట్ల ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నంలో చాగంటి కోటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హోం మంత్రి అనిత, పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవచనాలు నిర్వహించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ క్రమంలోనే తొలిసారిగా పాయకరావుపేట నియోజకవర్గంలో చాగంటి వారి ప్రవచనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డు తిమ్మాపురం శ్రీ ఆదర్శ పాఠశాల వద్ద చాగంటి కోటేశ్వరరావు గారికి హోం మంత్రి అనిత ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనితతో పాటు సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
చాగంటి కోటేశ్వరరావు గారు, హోం మంత్రి అనిత కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన విద్యాదీప్తి – సంస్కార స్ఫూర్తి కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులకు నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసంపై మార్గనిర్దేశం చేశారు.
“అమ్మ కంటే గొప్పవారు ఈ లోకంలో లేరు. అమ్మలా త్యాగం చేసేవారు ఎవరూ ఉండరు. పిల్లల కోసం తల్లి అవసరమైతే ప్రాణం కూడా త్యాగం చేస్తుంది. తల్లి రుణం తీర్చుకోవడం పిల్లలకు సాధ్యం కాదు. అమ్మను మోసం చేయడం మానవత్వానికి కలంకం” అన్నారు.
మనిషి ఎదగాలంటే కష్టపడాలి. రాయి ఎన్నో ఉలి దెబ్బలు తింటేనే దేవాలయంలో విగ్రహం అవుతుంది. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు మహాత్ముల జీవిత చరిత్రలను చదవాలి. ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలి అన్నారు.
గురువును, తండ్రిని గౌరవించడం నేర్చుకోవాలి. సమయం చాలా విలువైంది, దానిని సద్వినియోగం చేసుకోవాలి. చదవడాన్ని బరువుగా కాకుండా అదృష్టంగా భావించాలి. సెల్ఫోన్కు దూరంగా ఉండాలి” అని హితవు పలికారు.
చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం అనంతరం విద్యార్థులు చాగంటి గారిని పలు ప్రశ్నలు అడగగా, చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
చిన్నతనం నుండి పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు ఉండాలని అన్నారు. విద్యార్థులకు విద్యా సమపార్జుని ముఖ్యం అని,విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్నారు.
మీ కుటుంబంలో కూడా గురువుగారు సమానమే అన్నారు. జీవితాంతం మీ గురువుగారు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యులే అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో తొలిసారిగా చాగంటి వారి ప్రవచనాలు ఏర్పాటు చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరఫున చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు నేను ఎంతో అదృష్టవంతురాలినని భావిస్తున్నాను అన్నారు.
విద్యార్థి లోకానికి నైతిక విలువలు అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ గారు నిరంతరం కృషి చేస్తున్నారని, రాబోయే తరానికి బంగారు భవిష్యత్ అందించేందుకు పలు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
గురువుగారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట భవిష్యత్తుకు నాంది అని చెప్పారు. మంచి మనిషిగా సమాజంలో నిలబడేందుకు ఇలాంటి ప్రవచనాలు ఎంతో అవసరమని తెలిపారు.
తెలుగు ప్రజలు ఉన్నంతవరకు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయి” అని తెలిపారు.



చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందే: కన్నా