ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీష్ రావు నజరానా ప్రకటించారు. నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షల్లో 10/10 పాయింట్లు సాధిస్తే రూ.25 వేల నజరానా ఇస్తానని హరీశ్రావు తెలిపారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాలలో రూ.10 లక్షలతో నిర్మించే కిచెన్ షెడ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా హారీష్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలకు ఇక 2 నెలలే సమయముందని, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. బాలికల ఉన్నత పాఠశాలలో సదుపాయాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు. ఉత్తమ ఫలితాలు ఇవ్వడం ఉపాధ్యాయుల, విద్యార్థుల బాధ్యత అన్నారు. నియోజకవర్గంలో 10 పాయింట్లు సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ నజరానా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.