లాక్డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు ఇర్ఫాన్ ఖాన్. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలను జైపూర్ శివార్లలోని చుంగి నక శ్మశాన వాటికలో శనివారం సాయంత్ర జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ఇర్ఫాన్ పాల్గొనలేకపోయారు. కాగా నవాబుల కుటుంబానికి చెందిన ఆమె జైపూర్లోని బెనివల్కంత కృష్ణ కాలనీలో నివసిస్తున్నారు. మరోవైపు ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఆయన ముంబై నుంచి రాజస్థాన్ వెళ్లలేని పరిస్థితి. దీంతో, కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ అంత్యక్రియలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇర్ఫాన్ ఖాన్ వీక్షించారు. తన తల్లి చివరిచూపును వీడియో కాల్లో చూసుకున్నారు. కాగా, ఏఎన్ఐ రిపోర్ట్స్ ప్రకారం సయీదా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆమె సహజ మరణం పొందారు. రాజస్థాన్లోని టాంక్ నవాబ్ ఫ్యామిలీకి చెందిన సయీదా.. జైపూర్లోని బెనివాల్ కాంటా కృష్ణ కాలనీలో స్థిరపడ్డారు. ఇదిలా ఉంటే, ఇర్ఫాన్ 2018 మేలో క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. లండన్లో క్యాన్సర్కు చికిత్స తీసుకున్న ఆయన ఆ మహమ్మారి నుంచి కోలుకుని ఇటీవల భారత్ చేరుకున్నారు.
previous post