భారత సారధి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో లెగ్ స్పిన్నర్ ఆడం జంపా బౌలింగ్లో ఔటైన సంగతి తెలిసిందే. జంపా రాగానే దూకుడుగా ఆడదామని ప్రయత్నించిన కోహ్లీ తొలి బంతిని సిక్స్గా మలిచాడు. తర్వాతి బంతికి స్ట్రైట్డ్రైవ్లో ఫోర్ కొట్టబోయి బౌలర్ చేతికే చిక్కాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథి జంపా బౌలింగ్లో ఆరుసార్లు ఔటయ్యాడు. అదే సమయంలో ఫాక్స్ క్రికెట్లో వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆసీస్ మాజీ సారథి స్టీవ్వా కోహ్లీ.. జంపా బౌలింగ్ను తేలికగా తీసుకుంటున్నాడని, అందుకే మూల్యం చెల్లించుకుంటున్నాడని అన్నాడు.
విరాట్ కోహ్లీ తొలి వన్డేకు ముందు సోమవారం ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదే జంపా బౌలింగ్ను కొనియాడటం గమనార్హం. గతేడాది ఆసీస్ పర్యటనలో అతడు అద్భుతమైన ప్రదర్శన చేశాడన్నాడు. ‘2019 ఆసీస్ పర్యటనలో జంపా ఒక్కడే అందరి కన్నా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఆ సిరీస్ మొత్తం అతడి బౌలింగ్లో మా బ్యాట్స్మన్ బౌండరీలు కొట్టినా తర్వాత వాళ్ల వికెట్లు పడగొట్టాలని చూసేవాడు. మణికట్టు బౌలర్లకు అదే ముఖ్యమని నేను భావిస్తా. ఆ పర్యటనలో అతడి ఆలోచనా దృక్పథం ఎంతో అమోఘమైంది. అతడో నాణ్యమైన బౌలర్ ఇప్పటికీ వికెట్లు పడగొట్టే సత్తా ఉంది. అతడి బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాలి. అలాగే వారిపై అత్యుత్తమంగా ఆడే ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

