ఈరోజు పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు గారి 83వ జయంతి. భారతీయ సినిమా రంగంలో రామానాయుడు గారిది చేరిపోని ముద్ర..సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఆయన 13 భారతీయ భాషల్లో 150 చిత్రాలకు పైగా నిర్మించారు. నిర్మాతగా ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా చివరి వరకు ఒదిగి వున్నా మహోన్నత వ్యక్తి రామానాయుడు గారు. ప్రకాశం జిల్లా కారంచేడు లో జూన్ 6, 1936లో జన్మించిన రామానాయుడు విద్యాభ్యాసం కారంచేడు, ఒంగోలు లో సాగింది.
విద్యాభ్యాసం అనంతరం వూళ్ళో వ్యవసాయం చేస్తున్న రామానాయుడు జీవితం ఆ సినిమాతో మలుపు తిరిగింది. 1960లో కారంచేడు వాస్తవ్యులు యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో “నమ్మినబంటు ” చిత్రం నిర్మించాడు. ఈ చిత్రంలో నాగేశ్వర రావు, సావిత్రి హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ప్రొడక్షన్ లో రామానాయుడు గారు పాలు పంచుకున్నారు. అప్పుడే ఆయనకు సినిమా పట్ల అవగాహన, అభిమానం ఏర్పడ్డాయి. కారంచేడు నుచి వ్యాపారం చెయ్యడాని మద్రాస్ వెళ్లారు. అయినా ఆయన ద్రుష్టి అంతా సినిమా మీదనే. 1963లో భాగస్వాములతో కలసి “అనురాగం ” అన్న సినిమా నిర్మించారు. ఈ సినిమా నిరాశ పరిచింది. అయినా రామానాయుడు గారు అచంచల విశ్వాసంతో స్వంత సంస్థ ప్రారంభించారు. అదే సురేష్ ప్రొడక్షన్స్.
1964లో మహానటుడు ఎన్ .టి .రామారావు గారితో “రాముడు – భీముడు “అన్న చిత్రాన్ని తాపీ చాణిక్య దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాలో రామారావు గారు ద్విపాత్రాభినయం చేశారు. “రాముడు – భీముడు ” సూపర్ హిట్ అయ్యింది. అక్కడ నుంచి ఆయన తిరిగి చూసుకోలేదు. భారతీయ భాషలన్నిటిలో చిత్రాలు నిర్మించాలన్న ఆయన ఆలోచన సాకారమైంది. తాను పుట్టిన వూరు ఋణం తీర్చుకోవడం కోసం 1999లో బాపట్ల పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. భారతీయ సినిమా రంగానికి చేసిన సేవకు కేంద్ర ప్రభుత్వం 2009లో దాదా సాహెబ్ ఫాల్కే , 2012లో పద్మభూషణ్ అవార్డులతో రామానాయుడు గారిని గౌరవించింది.
తన 78వ ఏట 18 ఫిబ్రవరి 2015లో ఇహలోక యాత్ర ముగించారు. ఈరోజు హైదరాబాద్ ఫిలిం నగర్లో ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది. రామానాయుడు గారు చిర కీర్తిని మిగిల్చి, తెలుగు సినిమా రంగానికి మూవీ మొఘల్ గా ఎప్పటికీ స్మరణీయంగానే వుంటారు.
-భగీరథ