అనుకున్నట్టే ఐపీఎల్ ఈ సీజన్ నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టయింది. ఇప్పటికే అవకాశాలు సంక్లిష్టంగా మారగా.. రాయల్స్తో మ్యాచ్ రద్దవడంతో ఆ జట్టు కథ ముగిసింది. 5 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మొదట బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. అనంతరం రాయల్స్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన స్థితిలో మళ్లీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. 11 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా శాంసన్ (28) ఔటయ్యాడు. లివింగ్స్టోన్ (11) నాటౌట్గా నిలిచాడు. వర్షం పడకుంటే చివరి 10 బంతుల్లో ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈ మ్యాచ్ గెలిస్తే బెంగళూరు సాంకేతికంగా ప్లేఆఫ్ రేసులోనే ఉండేది. ఆ జట్టు చివరి మ్యాచ్ గెలిచి, మిగతా మ్యాచ్ల ఫలితాలు కలిసొస్తే ముందంజ వేయడానికి అవకాశముండేది. కానీ రాయల్స్తో మ్యాచ్ రద్దుతో బెంగళూరుకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి.
వర్షం అంతరాయం కలిగించడంతో అసలు జరుగుతుందా.. జరగదా అనే మ్యాచ్, కేవలం ఐదు ఓవర్ల కు కుదించారు. అయినా మరోసారి అంతరాయం తప్పకపోవటం లాంటివి ఉన్నా .. కోహ్లి, డివిలియర్స్ ఓపెనర్లుగా దిగడంతో, బెంగళూరు ఇన్నింగ్స్లో మెరుపులకు కొదవే ఉండదని ఆశించారు ఆ జట్టు అభిమానులు. ఆ అంచనాలకు తగ్గట్లే సాగింది తొలి ఓవర్. తొలి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలిచి ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు విరాట్. ఈ ఓవర్లో డివిలియర్స్ రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తంగా 23 పరుగులొచ్చాయి. ఈ ఆరంభం చూసి స్కోరు 90-100 ఖాయమనుకున్నారంతా. కానీ రెండో ఓవర్లో శ్రేయస్ గోపాల్ (3/12) సంచలన హ్యాట్రిక్తో కథ మార్చేశాడు. తన బౌలింగ్లో సిక్స్, ఫోర్ బాదిన కోహ్లి (25; 7 బంతుల్లో 1×4, 3×6)ని నాలుగో బంతికి ఔట్ చేశాడు. తర్వాతి రెండు బంతులకు డివిలియర్స్ (10), స్టాయినిస్ (0) కూడా వెనుదిరగడంతో హ్యాట్రిక్ పూర్తయింది. ఆపై వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెనుదిరిగారు. తొలి 9 బంతులకు వికెట్ కోల్పోకుండా 35 పరుగులు చేసిన బెంగళూరు.. తర్వాతి 21 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 27 పరుగులే చేసింది.
నేటి మ్యాచ్ : చెన్నై vs ఢిల్లీ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.