ఎన్ని చట్టాలు వచ్చినా .. మహిళలపై వేదింపులు మాత్రం ఆగకపోవటం విచారకరం. ఏదో ఒకపేరుతో ప్రతి రోజు ఎన్నో కేసులు .. అక్కడవరకు కూడా రానివి ఇంకెన్నో. తాజాగా, ఒక వ్యక్తి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడటంతో మనస్తాపం చెందిన యువతి విషం తాగి మృతి చెందింది. హైదరాబాద్ శివారు కేపీహెచ్ బీ కాలనీలో ఈ విషాద ఘటన జరిగింది. కేపీహెచ్ బీ కాలనీ ఫేజ్-9లో యువతి జ్యోతి, తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ప్రేమ పేరిట వేధింపులు ఎక్కువ కావడంతో ఆవేదన చెందిన ఆ యువతి, శీతల పానీయంలో విషం కలుపుకుని తాగింది.
ఈ విషయం గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై యువతి తండ్రి స్పందిస్తూ, రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మేరకు కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపడుతున్నారు.