తెలంగాణలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా తెరిపినిచ్చిన వాన.. నేడు ఉదయం నుంచి మళ్లీ మొదలైంది
మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.
హైదరాబాద్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, కూకట్పల్లి, బాలాజీనగర్, బాలానగర్లో 7 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మాదాపూర్, మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్, ఆర్సీపురం, రంగారెడ్డినగర్లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్, మౌలాలీ, హెచ్సీయూ, మోతీనగర్లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది.
భారీ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని..అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.