తెలంగాణ బీజేపీ నేతలు, లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జోరు పెంచారు. నిజామాబాద్ లోక్ సభ స్థానంలో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయనీ, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత ధర్మపురి అరవింద్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నకిలీ ఓట్లను తొలగించాలని బీజేపీ నేతలకు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
నకిలీ ఓట్లను తొలగించకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపవద్దని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశామని అరవింద్ తెలిపారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకంగా 1,25,000 నకిలీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. వీటిపై విచారణ జరిపి సత్వరం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్ సానుకూలంగా స్పందించారనీ, బోగస్ ఓట్ల ఏరివేతపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలిగా టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఉన్నారు.