తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యంహైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు.
12 ఏళ్లకే పోరాటంలో పాల్గొని రజాకార్లను ఎదిరించిన ధీర వనితగా పేరుంది. 16 ఏళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం తుపాకీ చేతబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భూస్వాములు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త మల్లు వెంకట నర్సింహా రెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు.
1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును ముచ్చెమటలు పట్టించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని దగ్ధం చేశారు. సాయుధ పోరాటంలో అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు. మహిళ కమాండర్ గా పని చేసిన మల్లు స్వరాజ్యాన్ని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని నైజాం ప్రభుత్వం ప్రకటించడం విశేషం. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు మల్లు స్వరాజ్యం.
స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. మల్లు స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.
1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.అలనాటి పోరాటాలను వివరిస్తూ స్వరాజ్యం ‘నా గొంతె తుపాకీ తూటా’ పేరుతో జీవిత కథను తీసుకొచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యానికి ఒక కుమర్తె సంతానం.. ఆమె పేరు పాదూరి కరుణ. ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు.
చిన్న కుమారుడు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు వున్నారు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.
చీరలకు సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ కావాలి: కేటీఆర్