ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘భారత్ బచావో’ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వల్ల దేశం చాలా నష్టపోతోందని, దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. కిలో ఉల్లి ధర రూ.200కు చేరిందన్నారు. నల్లధనం నిర్మూలన పేరిట అందరి జేబుల్లోని డబ్బులను మోదీ తీసుకున్నారని ఆరోపించారు.
నేడు జీడీపీ వృద్ధి రేటు 4 శాతంగా ఉందని, బీజేపీ తీసుకుంటోన్న చర్యలు ఏ మాత్రం ఫలించట్లేదని పేర్కొన్నారు. దేశంలో మోదీ అశాంతికి కారణమవుతున్నారని, ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయని రాహుల్ అన్నారు. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది. చెప్పిన నిజాలపై నేను ఎన్నడూ క్షమాపణలు కోరను. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ’ అని అన్నారు.