శబరిమల అయ్యప్పస్వామి ఆలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈరోజు నుంచి ఐదు రోజులపాటు మలయాళ నెల కుంభం సందర్భంగా ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. సాయంత్రం నుంచి ముఖ్య పూజారి వాసుదేవన్ నంబూద్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ ఆలయంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే మళ్ళీ గుడి తెలుస్తున్నారు, మేము మళ్ళీ స్వామిని దర్శించుకోవాలి అని ఇద్దరు మహిళలు కోర్టులో అర్జీ పెట్టుకున్న విషయం తెలిసిందే.
ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, హిందూ సంస్థల మధ్య పోరాటం నెలకొన్న విషయం తెలిసిందే. కోర్టు తీర్పును అమలు చేయాలని సర్కారు యత్నిస్తుండగా, అంగీకరించేది లేదని హిందూ సంస్థలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొందరు మహిళలు ఆలయంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన విషయం వెలుగు చూడడంతో ఈసారి హిందూ సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. దీంతో పోలీసులు ఆలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. నలుగురికి మించి గుమిగూడరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆలయ బోర్డు కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని ఇటీవల తమ నిర్ణయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. అయినా మిగిలిన హిందూ సంఘాలు మహిళల ప్రవేశాన్ని అంగీకరించకుంటే, మరోసారి ఆందోళనలు జరిగే అవకాశాలు ఉన్నాయి.