పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది.
ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు.
ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో తమ దేశంపై మళ్లీ దాడులు జరగకుండా కఠినమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ మూడు షరతులకు అంగీకరిస్తేనే శాంతి సాధ్యమని ఆయన తేల్చిచెప్పారు.

