ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చవద్దని అన్నారు. పంజాబ్ లోని ఆప్ కార్యకర్తలందరూ ఆక్సీమీటర్లు తీసుకుని కరోనా పేషెంట్లను గుర్తించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై అమరీందర్ సింగ్ ఘాటుగా స్పందించారు. మీ ఆక్సీమీటర్లు మాకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
పంజాబ్ లో ఉన్న మీ కార్యకర్తలు ప్రజలను ఆసుపత్రులకు వెళ్లనీయకుండా, వారంతట వారే కరోనా టెస్టులు చేసుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ముందు మీవారికి కళ్లెం వేయాలని కేజ్రీవాల్ కు సూచించారు.
కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అన్నారు. ఆక్సీమీటర్లను తీసుకొని ప్రజల్లోకి వెళ్లాలంటూ కేజ్రీవాల్ చెప్పాడాన్ని సింగ్ తప్పుబట్టారు. పంజాబ్ లో ఇప్పటి వరకు 57 వేల వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 1,618 మంది కరోనాతో మృతి చెందారు.

