నేటి నుంచి జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరిస్తున్నాయి. ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు… నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి. సర్దార్ వల్లభాయిపటేల్ జయంతి రోజున కశ్మీర్లో నవ శకానికి నాంది పడినట్టయ్యింది. అర్ధరాత్రి నుంచే కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. నేటి నుంచి జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. జమ్మూ కశ్మీర్ తన రాష్ట్ర హోదాను కోల్పోయింది. జమ్మూకశ్మీర్లో శాంతి భద్రతలన్నీ నేటి నుంచి నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. పోలీసు యంత్రాంగం యావత్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుచుకుంటుంది.
కేంద్రం నియమించిన లెఫ్ట్నెంట్ గవర్నర్కే సర్వాధికారాలు ఉంటాయి. భూ లావాదేవీల వ్యవహారాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. యూటీగా మారిన కశ్మీర్ అసెంబ్లీకి శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్ ఆర్డర్ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ వంటివన్నీ కేంద్రం నియమించిన లెఫ్ట్నెంట్ గవర్నర్ పరిధిలోనే పనిచేస్తాయి. జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లద్దాఖ్ ఎల్జీగా ఆర్కే మాథూర్లను కేంద్రం నియమించింది. వీరిద్దరూ అక్టోబర్ 31, 2019 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీనగర్, లేహ్లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్నెంట్ గవర్నర్స్ పదవీ ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరితో కశ్మీర్ హైకోర్టు సీజే గీత ప్రమాణం చేయిస్తారు.