కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన ఎన్నికల తర్వాత తొలిసారిగా కేరళ వెళ్లారు. తనను గెలిపించిన వయనాడ్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు శుక్రవారం కోజికోడ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మలప్పురం జిల్లాలోని కలికావులో ఆయన నిర్వహించిన రోడ్డుషోకు విశేష ఆదరణ లభించింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వాన జోరుగా కురుస్తున్నా రాహుల్కు ప్రజలు లెక్కచేయకుండా రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ఘన స్వాగతం పలికారు. కలికావు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు రాహుల్కు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తనపై ఇంతటి అభిమానం చూపుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వయనాడ్ ప్రజల తరపున పార్లమెంటులో తన వాణిని వినిపిస్తానన్నారు. బీజేపీ చిమ్ముతున్న విద్వేషాన్ని, అసహనాన్ని ప్రేమ, ఆప్యాయతలతో ఎదుర్కొంటానని రాహుల్ పేర్కొన్నారు.