యమహా మోటార్ నుంచి మరో కొత్త బైక్ మార్కెట్లోకి వచ్చింది. ఎంటీ-15 పేరుతో సరికొత్త 155సీసీ బైక్ను కంపెనీ నేడు విడుదల చేసింది. దీని ధర రూ. 1.36లక్షలు(ఎక్స్ షోరూం దిల్లీ)గా నిర్ణయించింది. లిక్విడ్ కూల్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వేరియబుల్ వ్యాల్యూ ఆక్చుయేషన్ తదితర అధునాతన ఫీచర్లతో యమహా ఈ బైక్ను తీసుకొచ్చింది.
యమహా ఎంటీ సిరీస్లో ఇప్పటికే పలు మోడళ్లను తయారు చేసింది. అయితే భారత్లో ఎంటీ-09 మోడల్ను మాత్రమే విడుదల చేసింది. 2015 నుంచి ఈ మోడల్ విక్రయాలు కొనసాగుతున్నాయి. దాని తర్వాత మళ్లీ ఎంటీ సిరీస్లో ఇప్పుడు ఎంటీ-15 బైక్ను తీసుకొచ్చింది. ఈ ఏడాది 60వేల ఎంటీ యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇండియా యమహా మోటార్ వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సింగ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్ను బట్టి ఎంటీ-03 లాంటి బైక్లను కూడా భారత్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.